*గద్దర్ అవార్డ్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది – టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్*
*గద్దర్ అవార్డ్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది – టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్*
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహణతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
*టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* – తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు కొన్ని గంటల పాటు సమయం కేటాయించి అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నింపాయి. అవార్డ్ పొందిన ప్రతి ఒక్కరూ ఇంకా బాగా మూవీస్ చేయాలనే స్ఫూర్తి పొందుతారు. ఏటా గద్దర్ అవార్డ్స్ క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నా. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారు కూడా గద్దర్ అవార్డ్స్ విజయవంతం కావడానికి బాగా కృషి చేశారు. అవార్డ్స్ పొందిన హీరోలు కొందరు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాకపోవడం సరికాదు. వారు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అవార్డ్స్ ప్రదానోత్సవంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. చాలా మంది ప్రముఖులకు పాస్ లు అందలేదు. తమ్మారెడ్డి భరద్వాజ అన్నకు రాత్రి 9 గంటలకు పాస్ పంపించారు. మా టీఎఫ్ సీసీలో ఒకరిద్దరికి మాత్రమే పాస్ లు వచ్చాయి. మా సంస్థలో దాదాపు వెయ్యిమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వారెవరికీ పాస్ లు అందలేదు. ఎఫ్ డీసీ కమిషనర్ హరీశ్ అనుభవరాహిత్యం ఈ కార్యక్రమ నిర్వహణలో కనిపించింది. ఆయనకు సినీ పరిశ్రమ గురించి కనీస అవగాహన లేదు. లేకుంటే ఇంకా బాగా కార్యక్రమం జరిగేది. గద్దర్ అవార్డ్స్ జ్యూరీలో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం కల్పించాలి. చిన్న చిన్న తప్పులు దొర్లినా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగినందుకు సంతోషంగా ఉంది అన్నారు.